నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాజుల్ పేట్ బడా రామ్ మందిర్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. ఇందూర్ నగరంలో అతిపురాతనమైన దేవాలయం బడా రామ్ మందిర్ లో గోశాల పక్కన ఉన్న గడ్డివాముకు అగ్ని ప్రమాదం జరగటం దురదృష్టకరం అన్నారు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న గోవులకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. సంఘటన విషయమై దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సంఘటనకు గల కారణాలు అడిగితెలుసుకున్నారు. ఇప్పటివరకు బాధ్యులైన వారిని గుర్తించకపోవడం కనీసం పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయకపోవడం పై మండిపడ్డారు. మందిరానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ, స్థానికులు ఎమ్మెల్యేకి విన్నవించుకోగ ఎమ్మెల్యే స్పందిస్తూ దేవాదాయ శాఖతో మాట్లాడి త్వరలో ప్రహరీ నిర్మాణంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, స్థానిక కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, గోకుల్ గోసేవ సమితి అల్లాడి రాజు , కృపల్ సింగ్, డివిజన్ బీజేపీ నాయకులు, బాల కృష్ణ,సుధాకర్,రమేష్, దీపక్,వెంకటరాములు,తదితరులు పాల్గొన్నారు.

