నిజాంసాగర్, బతుకమ్మ :
పిట్లం నుంచి మంగళూరుకు నడిచి వెళుతున్న మహిళను, మరో వ్యక్తిని బైక్ పై దింపుతానని ఎక్కించుకుని మార్గమద్యలో మద్యం తాగించి నగలను దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజాం సాగర్ ఎస్ఐ శివ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మంగళూర్ గ్రామానికి చెందిన గైని లచ్చవ్వ, గైని విఠల్ లు పిట్లంలో పని నిమిత్తం ఈ నెల 12 న వెళ్లారు. సాయంత్రం పిట్లంనుంచి కాలినడకన సొంత గ్రామం మంగళూరు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తివారితో మాటలు కలిపి తన బైక్ పై వారి ఊరిలో దింపివేస్తానని నమ్మించాడు. అతడిని నమ్మి బైక్ ఎక్కిన వారికి మార్గం మద్యలో మద్యం తాగించి వారు మత్తులో ఉండగా లచ్చవ్వ మెడలోని బంగారు గుండ్లు, చెవికి ఉన్న నాగుపడిగను లాక్కుని పరారీ అయ్యారు. బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
