*మోటారు వాహన ప్రమాద బాదిథులకు కోటి 25 లక్షల చెక్ అందజేత
*బ్యాంకు రుణాల చెల్లింపు తో దేశప్రగతి
* ప్రతిరోజు లోక్ అదాలత్
. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
చట్ట పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు.గ్రామస్థాయిలో న్యాయసవలు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలిపారు. కోర్టులలో ప్రభుత్వంపై దాఖలైన సివిల్ భూనష్ట పరిహార దావాలలో ఒక సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు పడవలసి అవసరం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. శనివారం జరిగిన జాతీయ లోక్ ఆదాలత్ లో ఒక మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాలో గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ లిమిటెడ్ వారితో,బాధితులతో సంప్రదింపులు జరిపి రాజీపద్దతిన పరిష్కరించి ఒక కోటి 25 లక్షలకుగాను లోక్ అదాలత్ అవార్డు జారీ చేయడం చాలా గొప్ప విషయంగా జిల్లా జడ్జీ అభివర్ణించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందడం వలన బాధిత కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును కల్పించగలిగామని జిల్లాజడ్జి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవడం వలన వారికి,బ్యాంకులకు ఆర్థికలబ్ది చేకూరి దేశప్రగతి బాటలు వేసిన వారుకాగలరని ఆమె అన్నారు. రెండు నెలలకు ఒకసారి పెద్దఎత్తున నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లతో పాటు ప్రతిరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తు కక్షిదారులకు అందుబాటులో న్యాయసేవలు అందించడం జరుగుతున్న దని ఆమె వివరించారు.డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి మాట్లాడుతూ నేరాలను నియంత్రణకు ప్రతిపౌరుడు పోలీస్ పాత్ర నిర్వహించాలని అన్నారు.మహిళల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని,మద్యం సేవించి మోటారు వాహనాలు డ్రైవ్ చేయరాదని ఆయన కోరారు.అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ మాట్లాడుతూ పాతకాలంలో గ్రామంలో పంచాయతీ ఉండి పరిష్కరించే విధానం ఉండేదని నేడు చట్టబద్ధత కలిగిన లోక్ అదాలత్ లు రాజమార్గంలో ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చి వివాదాలను పరిష్కరిస్తున్నాయనితెలిపారు.మధ్యవర్తిత్వంను మరింత ప్రోత్సహించి కక్షిదారులు వారి కేసులను పరిష్కరించుకునే విధంగా శ్రామిద్దామని ఆయన అన్నారు.కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్,సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, చైతన్య, హరి కుమార్, శ్రీనివాసరావు ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కోటి 25 లక్షల రూపాయలకు గాను లోక్ అదాలత్ అవార్డు…
మోటారు వాహన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి పవార్ గజేందర్ తరపున ఆయన భార్య కుమారులు, కుమార్తె కలిసి ఉమ్మడిగా వేసిన మోటారు వాహన నష్ట పరిహార దావాలో వారి తరపున న్యాయవాది చిన్యా నాయక్,గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ న్యాయవాది సదానంద్ గౌడ్ లతో సంప్రదింపులు జరిపి రాజీపద్దతిన కోటి 25 లక్షల రూపాయలకు గాను లోక్ అదాలత్ అవార్డును అందజేశారు.
