- ప్రశ్నించినందుకే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసు రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెల్సిన తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దానిపై ఫిర్యాదు తీసుకోవాలని సిఐని ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకే హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లతో పాటు ఇతర నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగబడే రోజులు వస్తాయని, ఫిర్యాదులు తీసుకునే ధైర్యం కూడా లేదన్నారు. ఎమ్మెల్యేలను కోర్టు ముగిసిన తర్వాత పంపించాలని కావాలని పోలీసు శాఖ జాప్యం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.

