నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుపుకునే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 2కే వాక్ కార్యక్రమం సెప్టెంబర్ 29న నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ వాక్ రుక్మిణి చాంబర్స్, వినాయక్ నగర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ బస్వరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సదానంద రెడ్డి, డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ జగదీష్ చంద్రబోస్, డాక్టర్ వరిస్ అలీ మాట్లాడుతూ.. “గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయి. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, ఆరోగ్య పరీక్షల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం” అని పేర్కొన్నారు. మెడికవర్ ఆస్పత్రి తరఫున ప్రజలందరినీ ఈ 2కే వాక్ లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆహ్వానించారు. అలాగే ఈ సందర్భంగా సాధారణంగా రూ.5000 విలువ గల కార్డియాలజీ ప్యాకేజీని కేవలం రూ.999 కి అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్యాకేజీని తప్పక వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
