డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్, హైదరాబాద్ బుధవారం నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలలో తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూల అనంతరం మొత్తం 29 మంది అభ్యర్థులు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికలో డిగ్రీ అర్హతతో 10 మంది, ఎంఎస్సీ అర్హతతో 19 మంది ఎంపికయ్యారు. ఎంఎస్సీ అర్హతతో ఎంపికైన వారిలో 13 మంది పురుషులు, 6 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్, యం.యాదగిరి రసాయనశాస్త్ర విభాగాధిపతి డా. బి. సాయిలు, అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ పరిశ్రమలతో విశ్వవిద్యాలయాల అనుసంధానం విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు వారి ఉద్యోగ జీవితంలో విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
