- వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు
- ఫైర్ ఇంజన్ రెస్యూ టీం సహాయంతో కాపాడిన పోలీసులు
- సందర్శకుల రాకపోకలు నిలిపివేత
- పర్యాటకులు సహకరించాలని ఎస్సై సూచన
ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామంలోని శీలం జానకీబాయి ఆధ్వర్వంలో నిర్మించిన అలుగు నుండి భారీ నీటి ప్రవాహంతో పాల పొంగులా నీరు రావడంతో సిర్నపల్లి “వాటర్ పాల్స్” పరవాళ్ళు తొక్కుతోంది. అందాలను చూసేందుకు తరలివస్తున్న ప్రకృతి ప్రేమికులు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడుపుతుంటారు. ఈసారీ సరదాగా వెళ్ళిన ముగ్గురు వరద ఉధృతిలో చిక్కుకోవడంతో ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ రెస్యూ టీం తో వారిని క్షేమంగా కాపాడారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం సందర్శకులను అనుమతించడం లేదు. మండలంలోని సిర్నాపల్లి గ్రామ సమీపంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ అలుగును నిర్మించారు. చెరువు నిండి పై నుంచి పొర్లుతున్న నీటిని చూస్తుంటే కుంటాల జలపాతం ను తలపిస్తుంది.. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఎత్తైన ప్రదేశం నుంచి నీటి దారలు పాల పొంగులా కిందికి వస్తుంటాయి. దీంతో వరద ఉధృతి తగ్గేవరకు వాటర్ పాల్స్ సందర్శనకు అనుమతి లేదని ఎస్సై సందీప్ తెలిపారు.

