కామారెడ్డి, బతుకమ్మ :
నాన్ వెజ్ ఎందుకు వండలేదని అడిగినందుకు భర్తను కొడవలితో నరికి హత్య చేసింది అతని భార్య. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో కోదండ శివాజీ – లక్ష్మీ దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి రెండేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే శనివారం రాత్రి పని చేసుకుని ఇంటికి వచ్చిన శివాజీ తన భార్యను మాంసం కూర వండలేదా అని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవ లో క్షణికావేశంలో లక్ష్మి కొడవలితో భర్త శివాజీ మెడపై దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.