. . . అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచార హక్కు చట్టం
రుద్రూర్, బతుకమ్మ :
ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత సముదాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడంతో, సమాచారం కోసం కార్యాలయానికి వచ్చిన వారికి ఎవరికి దరఖాస్తు అందజేయాల్లో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. స.హ హక్కు చట్టం ప్రకారం అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేసి దానిపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయించి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ముఖ్యంగా నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే తహశీల్దార్ కార్యాలయంలో అసలు సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడంతో ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియక దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. మండల సమీకృత సముదాయ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.
