మాక్లూర్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాల పెంపు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో ఈనెల 11న హైదరాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ప్రచార కరపత్రాలను మాక్లూర్ కేజీబీవీలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల పట్ల ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కేజీబీవీ సిబ్బంది వేతనాలను సమీక్షించాలన్నారు. ఏళ్లుగా వీరికి వేతనాలు పెరగలేదని, పైగా పని భారం పెరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించమని విన్నవిస్తే, అదనంగా నైట్ డ్యూటీలు వేశారని ఆరోపించారు. కేజీబీవీ ల పట్ల గత ప్రభుత్వం కంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా అధికారులను ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కలిసి విన్నవిస్తూనే ఉన్నామని, ఇక పోరాటం తప్ప మరోమార్గం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలనైనా తక్షణమే అమలు చేయాలన్నారు. అకౌంటెంట్, వర్కర్లకు నిబంధనలకు, జాబ్ చార్ట్ కు భిన్నంగా ఇటీవల కేటాయించిన నైట్ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. వారానికి ఒకరోజు సెలవు చొప్పున వర్కర్లకు వీక్లీఆఫ్ అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీచేసి పనిభారం తగ్గించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హతలు ఉన్న నాన్ టీచింగ్ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేసి ఉద్యోగ, ఆరోగ్యభద్రత కల్పించాలన్నారు.రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ లో జరిగే మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేజీబీవీల నాన్ టీచింగ్, వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుమలత, కేజీబీవీ సిబ్బంది కావ్య, పద్మ, ప్రేమ, లక్ష్మి, వాసుకి, భారతి, సంతోషి, గోదావరి తదితరులు పాల్గొన్నారు.
