- వందల మందికి ఉచిత వైద్యం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమని నుడా చైర్మన్ కేశ వేణు సూచించారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యుల సూచనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు రామర్తి గోపి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘంలో ఆదివారం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి స్థానికంగా అనుహ్య స్పందన లభించింది.మెగా వైద్య శిబిరాన్ని నుడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో కాలానుగుణంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మెగా క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఈ శిబిరంలో పలువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి కావలసిన మందులను ఉచితంగా అందించారు. ప్రముఖ జనరల్ ఫిజీషియన్ విశ్వ తేజ్, గుండె వైద్య నిపుణులు రవి కిరణ్, ఆర్థోపెడిక్ సర్జన్ హర్షవర్ధన్ గౌడ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాహుల్, ప్రసూతి వైద్య నిపుణురాలు శైలజ, పిల్లల వైద్య నిపుణులు అశ్విన్, దంత వైద్య నిపుణులు శిరీష తదితరులు వైద్య సేవలు అందించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చి మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వైద్య శిబిరం సక్సెస్ కావడం పట్ల రామర్తి గోపి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
