బోధన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శనివారం బోధన్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే భరోసా సెంటర్ అందిస్తున్న సేవలను వివరించారు. అదనంగా మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణపై కూడా అవగాహన కల్పించారు. టి-సేఫ్ యాప్, సైబర్ క్రైమ్, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టి-సేఫ్ యాప్ వినియోగం, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై జాగ్రత్తలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన సహాయం, అలాగే మహిళలపై వేధింపులను ఎదుర్కొనేందుకు స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న సహాయ సేవలను వివరించారు. మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో భరోసా కోఆర్డినేటర్ రోజా, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.
