. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నవభారత నిర్మాణానికి నాందిగా ఈ ఉగాది పండుగను భావిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బసవ గార్డెన్ లో గురువారం సాయంత్రం ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ జన్మదినం కూడా ఉగాది రోజే కావడం స్వయంసేవకులకు ఎంతో ప్రత్యేకమైన తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం శతాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉగాది కార్యక్రమం భవిష్యత్తు భారత గతిని స్థితిని పరమ వైభవ సాధన దిశగా మలిచేందుకు నాందిగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న శతాబ్దము హిందూ శతాబ్దమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ అశాంతితో, అనైక్యతతో ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ రగిలిపోతుంటే భారతదేశంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని ఆయన గుర్తు చేశారు.
హిందువులు జరుపుకునే ప్రతి పండుగలు ఒక విశేషమైన సందేశాన్ని ఇస్తాయని ఉగాది రోజు కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ రాబోయే సంవత్సర కాలం పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు సుఖాలు బాధలు దుఃఖాలను సమదృష్టితో చూడగలిగే మానసిక స్థితిని నిర్మాణం చేయడం కోసమే ఉగాది పచ్చడిని ఆరు రుచుల సమ్మేళనంగా తయారుచేసి స్వీకరిస్తామని పచ్చడి ద్వారా మన సంస్కృతి మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని తెలుపుతుందని ఇటువంటి మహోన్నతమైన సంస్కృతి ఈ భూ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఆయన తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం కాదని ఉగాది మాత్రమే నూతన సంవత్సరమని భారతీయులందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.వసంత కాలం రాగానే చెట్లు పాత ఆకులను పూర్తిగా రాల్చుకొని కొత్తగా చిగురిస్తూ నూతన ఉత్సాహంతో ఎదగడం ప్రారంభిస్తాయని ప్రకృతి మనకు ఇంత స్పష్టంగా నూతనత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటే ఎలాంటి మార్పులకు ఆధారం కానీ జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా జరుపుకోవడం నిజంగా మూర్ఖత్వం అని ఆయన తెలిపారు. ప్రకృతి హితముగా జీవించడం మనందరి కర్తవ్యం అని అందుకే సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని మనందరం పూర్తిగా నియంత్రించాలని ప్రకృతికి హాని కలిగే విధంగా ఎలాంటి పనులు చేయవద్దని ఆయన సూచించారు. ఆర్ఎస్ఎస్ కేవలం తమ సంస్థ ఎదగాలని ఎన్నడూ కోరుకోలేదని సమాజంలో పరివర్తన రావాలని నిరంతరము కృషి చేస్తున్నదని ఆయన తెలిపారుస్వయం సేవకులు అందరూ సమాజంలోని అన్ని రంగాలలో దేశభక్తిని మరియు సామాజిక బాధ్యతను తోటి వారికి గుర్తు చేస్తూ లోకహితంగా బతికే మార్గాలను సూచించాలని ఆయన తెలిపారు. సమాజంలో మంచి చెడులు ఎప్పటికీ ఉంటాయని కానీ మంచి సక్రియంగా ఉన్నట్టయితేనే చెడు తన ప్రభావాన్ని తగ్గించుకుంటుందని లేనియెడల చెడు ఎక్కువగానే కనిపించి మంచికి తావు లేకుండా పోతుందని అందుకే మంచివారైన వ్యక్తులందరూ సమాజం కోసం ఆలోచించాలని అందుకోసం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.దేశాధినేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని దీనంతటికీ కారణం కేవలం మనుషులు కూర్చుని మాట్లాడుకోకపోవటమేనని అందుకే మనుషులు కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఏవి ఉండవని ఆయన తెలిపారు. అందుకే ఆర్ఎస్ఎస్ కుటుంబ స్థాయి నుంచి మొదలుపెట్టి దేశం మొత్తంలో కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఆలోచించడం, కలిసి చర్చించడం వంటి సంస్కారాలను సమాజంలో నింపేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.భారతదేశంలో ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశమని, లోకా సమస్త సుఖినోభవంతు అని కోరుకున్న ఏకైక దేశమని అందుకే ఇప్పుడు కూడా ఈ యుద్ధాలన్నీ ఆగిపోయి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని భారత దేశ ప్రజలందరూ కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. వసుదైక కుటుంబం అనే భావనకు పూర్తి హిందుత్వమేనని భారత దేశంలో మెజారిటీలు హిందువులు కాబట్టే ఇతర మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అది హిందుత్వం యొక్క స్ఫూర్తి అని ఆయన స్పష్టం చేశారు. ఈ శతాబ్ది సందర్భంగా హిందూ సమాజం మొత్తాన్ని ధర్మ మార్గం వైపు నడిపించడం కోసము ఏకత్రిత సూత్రంపై నిలబెట్టడం కోసము జన జాగరణ మరియు హిందూ సమ్మేళనాల పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి బస్తీలో కార్యక్రమాల నిర్వహిస్తున్నదని వీటిని సమస్త హిందూ సమాజం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేష్, నగరంలోని ప్రాంత, విభాగ్, జిల్లా అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

