— రైతు నాయకుడు అన్నారం వెంకటరామిరెడ్డి.
– పిట్లం, బతుకమ్మ:
రైతు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక వారి గోస పుచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండల రైతు నాయకుడు అన్నారం వెంకటరామిరెడ్డి అన్నారు. పిట్లం మండలంలో జొన్నలు పండించిన రైతులను పరామర్శిస్తూ వారి సాధకబాదాకలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. మండలంలో 708 ఎకరాలలో రైతులు జొన్న పంటను పండించారన్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ఇప్పటివరకు మండలంలో ఒక కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షతకు నిదర్శనం అన్నారు. రైతు పండించిన పంటను ఎక్కడికక్కడ ఆరబెడుతూ రాత్రి పగలు వాటిని కాపాడుకోవడానికి అనేక విధంగా కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులకు, అధికారులకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మార్క్ ఫేడ్ అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, విజయ్ కుమార్, జంబిగే హన్మండ్లు, మాజీ సొసైటీ చైర్మన్ సాయి రెడ్డి, మహిపాల్ రెడ్డి రైతులు, తదితరులు పాల్గొన్నారు,
