- శివాజీ మహారాజుకు ఘన నివాళులు అర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
ఇందూరు, బతుకమ్మ : హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులను ఎదిరించి, హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్బంగా నాందేవాడ శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సందర్బంగా ఆయన మాట్లాడారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జిజియా బాయ్ గొప్ప స్ఫూర్తి, చిన్నతనం నుంచే ఆయనను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. మొఘలుల కాలంలో హిందువులను బానిసలుగా చేసి, మత మార్పిడులు బలవంతంగా జరిగించిన రోజుల్లో శివాజీ మహారాజ్ 17వ ఏటనే కత్తి చేతపట్టి జై భవాని అంటూ మొఘలులపై తిరుగుబాటు చేశారన్నారు. నేటి యువత అక్బర్, బాబర్, ఔరంగా జేబు, మొఘల్ చరిత్ర కంటే, ఛత్రపతి శివాజీ, వీరసావర్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావుల చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందూ యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎర్రం సుదీర్, మాస్టర్ శంకర్, సంజయ్ పురోహిత్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

