ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆలయంలోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ తండా జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం… హాజీపూర్ తండాలో ఉన్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో పూజారి దుప్య నాయక్ రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ గొలుసుతో వేసిన తాళాన్ని విరగొట్టి సుమారు రూ.30వేలు నగదును అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయ పూజారి దుప్య నాయక్ వచ్చి చూడగా హుండీ కనిపించకపోవడంతో తండావాసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలో చుట్టూ పక్కల చూడగా తాళాలు పగలగొట్టి ఉండడంతో అందులో నగదు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీంకు సమాచారమివ్వడంతో వివరాలు సేకరించింది.
