నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, ఆరు గ్యారెంటీల్లో నుంచి ఒక్క గ్యారెంటీని అదీ మహిళలకు ఉచిత బస్సు తప్ప దేనినీ అమలు చేయడం లేదన్నారు. ఎంత మంది రైతులకు రుణమాఫీ అయ్యిందో ప్రభుత్వం చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు అంటున్న వారు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బుల్డోజర్లు అంటున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
