నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పట్టణ ప్రాంతాలలో ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా జరిగిందని, తెలంగాణలోనూ వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు మ్యాపింగ్ ప్రక్రియ విషయంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు, సూపర్ వైజర్ లకు దిశా నిర్దేశం చేస్తూ ఉండాలన్నారు. బూత్ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున వారి సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓ లతో స్వయంగా మ్యాపింగ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపితే మిగిలిన వారి మ్యాపింగ్ చేసేందుకు సులభతరమవుతుందని అన్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిలో ఉందని అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కారణాల వల్ల కొంత వెనుకబడి ఉందన్నారు. అర్బన్ లో 44.78 శాతం మ్యాపింగ్ జరిగిందని, ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వారం పది రోజుల వ్యవధిలో 70 శాతం వరకు మ్యాపింగ్ పూర్తి చేయిస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.