
. ఎండిపోయిన మొక్కలు
. ప్రజాధనం వృథా
. పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ: అటవీ సంపదను పెంచాలను లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నర్సరీల్లో మొక్కలను పెంచి ప్రతి ఏడాది గ్రామాలు, పట్టణాల్లో మొక్కలను నాటుతున్నారు. అయితే నర్సరీల పై అధికారుల పర్యవేక్షణ కరువుకావడంతో మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీలో పచ్చగా కళకళలాడాల్సిన మొక్కలు జీవం కోల్పోతున్నాయి. ప్రజాధనం వృథా అవుతున్నా పట్టించుకునే వారు లేకుండపోయారు. హరితహారం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలానికి లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. కానీ అవేమీ పట్టనట్లుగా నర్సరీలోని మొక్కలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

