నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న దడువాయి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దువాయి యూనియన్, ఐఎన్ టీయూసీ నాయకులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఆయన కలెక్టర్ కు లేఖ రాసి దడువాయి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దడువాయి కార్మికులకు వ్యవసాయ మార్కెట్ 15 కిలోమీటర్ల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో అవకాశం కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, ఇందిరమ్మ ఇళ్లను కార్మికులందరికీ మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఐ ఎన్ టీ యూసీ నాయకులు మల్యాల గోవర్ధన్, దడువాయి యూనియన్ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రవీందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు లవంగా అశోక్, ప్రధాన కార్యదర్శి రణం రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
