- ప్రజాప్రతినిధి అండతో అసైన్డ్ భూమిలో వెంచర్
- గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అనుమతి లేకుండానే నిర్మాణాలు
- నందిపేట్ మండలంలో అసైన్డ్ భూముల్లో వెంచర్ కలకలం
నిజామాబాద్, బతుకమ్మ : అసైన్డ్ భూమి. ప్రభుత్వం పేదలకు కేటాయించే భూమి. దానిని మార్పిడి జరుగదు.కొనుగోలు అసలే ఉండదు. వారసత్వంగా వారసులు అనుభవించడం మినహా అసైన్డ్ భూమిలో ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ జరిగిన ఎన్ వోసీ ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే అసైన్డ్ ల్యాండ్ కమిటీ చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా, సంయుక్త కలెక్టర్, ఆర్డీవో, ల్యాండ్ సర్వే ఏడిలతో కూడిన కమిటీ ఇవ్వాల్సిందే. అప్పుడైతే కానీ అసైన్డ్ భూమికి యజమాన్య మార్పిడి జరుగదు. కానీ ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో అసైన్డ్, ఖరీజ్ ఖాతా భూములు ఎక్కువ. మండల కేంద్రంలోనూ అత్యధిక భూములు ఉన్నవి నందిపేట్ లోనే. నందిపేట్ మండలంలో అసైన్డ్ భూముల పంచాయితీలు కొక్కొల్లాలు. ఈసారి నందిపేట్ మండలం వన్నెల్(కె) గ్రామంలో అసైన్డ్ భూమిలో వెంచర్ వెలిసింది.

ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధి అనుచరులమని కాషాయ పార్టీ నేతలు బరి తెగించారు. నందిపేట్ మండలం వన్నెల్(కె) గ్రామంలో ఉన్న 392/4 సర్వే నంబర్ లో ఎకరం 5 గుంటల్లో అసేన్డ్ భూమిలో వెంచర్ ఏర్పాటు చేశారు. కావున ప్రజాప్రతినిధి కీలక అనుచరులమని ఎవరిని లెక్క చేయకుండా వెంచర్ ఏర్పాటు చేసి రోడ్లను ఏర్పాటు చేసి 25 ప్లాట్లను విక్రయానికి చేశారు.

ఇటీవల అక్కడ నిర్మాణాలకు చకచక ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానంగా గ్రామంలో ఇంటి నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ అనే దందా నందిపేట్ మండలంలో రివాజుగా మారింది. అదే ప్రయోగాన్ని బీజేపీ నేతలు ప్రయోగిస్తున్నారు. ప్రధానంగా డీటీసీపీ, నుడా, గ్రామ పంచాయితీ అనుమతులు ఏవి లేకుండానే ఏకంగా అసైన్డ్ భూమి వెంచర్ ఏర్పాటు చేసిన వాటిని ఇంత వరకు అధికారులు అడ్డుకోకపోవడంపై ఆరోపణలున్నాయి. ముందుగా జాగ్రత్త వహిస్తూ ప్రభుత్వ సెలవు దినాలు, పండుగల పూట నిర్మాణాలు చేపట్టడం విశేషం. ఈ విషయంపై గ్రామస్తులు గ్రామ పంచాయితీ కార్యదర్శితో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు.

నీతికి, నిజాయితీకి, దేశం కోసం, ధర్మం కోసమని నీతులు వల్లించే పార్టీ నేతలే ఏకంగా అసైన్డ్ భూమిలో వెంచర్ చేసి అమ్మకానికి పెట్టడం, వాటిని కొనుగోలు చేసిన వారు రోడ్డున పడే అవకాశం ఉంది. అసైన్డ్ భూమికి రిజిస్ట్రేషన్ జరుగదని, ఇంటి నంబర్ ఆధారంగా వర్డ్ బ్లాక్ రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు చేయడం అందుకే నిర్మాణాలను పరుగులు పెట్టిండంపై ఆరోపణలున్నాయి. గ్రామస్తులు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిర్మాణాల పనులను ఆపలేదనన ప్రశ్న తలెత్తింది. చివరకు గ్రామస్తులు జిల్లా అధికారయంత్రాంగానికి ఫిర్యాదు చేయడంతో పనులను నిలిపివేయాలని పంచాయితీ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పనులు నిలిపివేస్తారా లేక నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

