నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బదిలీపై వెళ్లిన డీఈఓ దుర్గ ప్రసాద్ గత రెండు రోజుల క్రితం తేదీ మార్చి ఇచ్చిన ఉత్తర్వులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనేక ఫైళ్లపై ముందు తేదీతో సంతకాలు చేసి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేయకుండా నిలిపివేయాలని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖ అధికారిగా అనేక అవినీతి అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. లంచాలు ఇవ్వని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లకు పాల్పడడం, డీసీఈబీ నిధుల గోల్మాల్, వెబ్ ఆప్షన్ ద్వారా పదోన్నతులు కల్పించబడిన ఉత్తర్వులను కామ్ స్కాన్ ద్వారా సుమారు 100కు పైగా మోడిఫికేషన్ చేసి అక్రమాలకు పాల్పడిన వైనం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
