. . . రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
ఆదిలాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన మైనార్టీ గురుకుల బాలుర-2 విద్యాలయం, జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను శనివారం మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో మైనార్టీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. గతంలో విద్యా అవకాశాలకు దూరంగా ఉన్న మైనార్టీ విద్యార్థులకు ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలతో కూడిన గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, ఉచిత విద్య, భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారమని, మైనార్టీ యువత ఉన్నత చదువులు పూర్తి చేసి వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని షబ్బీర్ తెలిపారు. విద్యతో పాటు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రతి మైనార్టీ కుటుంబం తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహమ్మద్ అజారుద్దీన్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీ ఉల్లా ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే లు వెడ్మా బొజ్జు, పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
