. . . ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గ్రామాల్లో కూడా ఫ్రీ గా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చిందని, ఇకనైనా ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియా పై ప్రతాపం చూపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మంగళవారం కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని, దీని కారణంగా మా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుందన్నారు. గృహహింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతున్నాయని తెలిపారు. అదే విధంగా ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని, వాళ్లకు ట్రైనింగ్ లో గన్ ఫైరింగ్ ఉంటుంది, కానీ వెపన్స్ ఇవ్వటం లేదని అన్నారు. వారి వద్ద ఆయుధాలు ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కాస్త భయం ఉంటుందని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.

