నిజామాబాద్, బతుకమ్మ: వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు మిగిలిన 95 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా పాఠాలు బోధించి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సోమవారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతి గదులను, కళాశాల పరిసరాలను సందర్శించారు. ఫ్రాక్టికల్స్ కు, వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల కారణంగా తలెత్తే పరిణామాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపల్ ఫయీముద్దీన్ తో పాటు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
