. . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందించగలిగితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారని అన్నారు. విద్యా శాఖతో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్పై గురువారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవని, వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చామని వివరించారు. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తుందని, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదన్నారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవే ఉండాలని, నాణ్యతతో పాటు సకాలంలో అందడంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధిత మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని, అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించాలని, ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని తనిఖీ చేసుకోవాలని పేర్కొన్నారు. నోటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యత, వాటిని అందుకున్న తర్వాత వారి భావాలను తెలియజేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.