. . . డా. ఆనంద్ మాలు, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డా. ఆనంద్ మాలు, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ సూచించారు. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్తో పాటు విరోచనాలు (డయేరియా), పచ్చ కామెర్లు (జాండిస్) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలని, శుభ్రమైన, మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలని, బయటకు వెళ్తే తలకు కప్పు (క్యాప్/టవల్) ఉపయోగించాలని వారు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని, తేలికపాటి, పలుచని దుస్తులు ధరించాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని, బయట ఆహారం, అస్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం పూర్తిగా నివారించాలన్నారు. చేతులు తరచూ కడుక్కోవాలని, పరిశుభ్రత పాటించాని, పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. వాంతులు, విరోచనాలు, జ్వరం లేదా కళ్ళు/చర్మం పసుపు రంగులో మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వేసవి కాలంలో చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.