బోధన్, బతుకమ్మ : మంజీర నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కల్దుర్కి గ్రామస్తులు శుక్రవారం ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. బోధన్ మండలం సిద్ధాపూర్, కండ్ గావ్ ప్రాంతంలోని మంజీర నదిలో జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ లోతుగా ఇసుక తవ్వడంతో భూగర్భ జల మట్టం తగ్గుతోందని, తాగునీరు, సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్లలో 15 టన్నుల వరకు ఇసుక తరలించేందుకు అనుమతి ఉండగా, 20 నుంచి 25 టన్నులు తరలిస్తున్నారని, మితిమీరిన వేగంతో టిప్పర్లు వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రామాల రోడ్లు ధ్వంసమవుతున్నాయని అన్నారు. తమ ఇబ్బందులకు ప్రభుత్వం, క్వారీ నిర్వాహకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

