నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ ఫొటో, పేరును తొలగించినందుకు ఆదివారం కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన తెలుపమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఈపథకాన్ని నీరుగారుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటాను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పెంచిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో రోజువారి కూలీ పనిని తగ్గించిన ఘనతను బిజెపి మూటగట్టుకుందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులను బీజేపీ పార్టీ అవమానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహిర్బీన్ హందన్, కేశ వేణులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

