కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఇఎస్ఆర్ గార్డెన్స్ లో రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా రిలీఫ్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మట్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఇన్ఫోసిస్, రామకృష్ణ మట్ వారి సహకారంతో ముంపు బాధిత కుటుంబాలకు 334 రిలీఫ్ కిట్స్ ను అందించడం జరిగిందని తెలిపారు. రిలీఫ్ కిట్లో బియ్యం, పప్పు, నూనె, సబ్బులు, పప్పులు, ఉప్పు, పసుపు తదితర నిత్యావసర సరుకులు, బ్లాంకెట్లు, దుప్పట్లు ఈ రిలీఫ్ కిట్ లో ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ మంగళవారం ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను ఇన్ఫోసిస్ మరియు రామకృష్ణ మట్ సహకారంతో అందించడం జరుగుతుందని అన్నారు. ఆపద సమయంలో ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకుంటున్నందుకు రామకృష్ణ మట్ మరియు ఇన్ఫోసిస్ సంస్థకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నట్టు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద భాదితులను ఆడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డిఓ వీణ, తహసీల్దార్ జనార్దన్, రామకృష్ణ మట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

