నిజామాబాద్, బతుకమ్మ : రుణ మాఫీకి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ఇచ్చిన గడువు ముగియడంతో జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీపై తాడోపేడో తేల్చుకునేందుకు ఆర్మూర్ డివిజన్ రైతులు సిద్ధమయ్యారు. ఎన్నికల హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జాతీయ రహదారిపై ఆందోళన చేసిన రైతులు ప్రభుత్వానికి ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో గడువు తేదీని ఈనెల 19కి వాయిదా వేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతులు తహసీల్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ లకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
