బిచ్కుంద, బతుకమ్మ :
వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక తెలంగాణ హడక్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9న జరగనున్న రాష్ట్రస్థాయి మహాసభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం హైదరాబాద్లోని సోమయప్ప మఠంలో హడక్ కమిటీ అధ్యక్షులు సోమయప్ప మహా స్వామీజీ అధ్యక్షతన ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై మాట్లాడారు. సమావేశంలో 2026 ఆగస్టు 9వ తేదీన రాణిగంజ్ శంకరమఠంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక మహాసభ నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, నాయకులు పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సమాజ ఐక్యత, సంఘ బలోపేతం, యువత భాగస్వామ్యం, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, వీరశైవ లింగాయత్ సమాజ ఐక్యతకు ఇటువంటి రాష్ట్రస్థాయి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మహాసభ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వీరశైవ లింగాయత్ తెలంగాణ హడక్ కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, సంఘ నాయకులు పాల్గొని మహాసభ విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

