ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మ కి వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన మండలి సంయుక్తంగా కాళోజీ నారాయణ రావు సాహిత్య రత్న పురస్కారం ప్రకటించింది. బాల సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తూ, విద్యార్థులలో సాహిత్య సృజనాత్మకతను బయటకి తీసుకువచ్చి వారిచేత కథ, కవితల సంపుటిలు, శతక పుస్తకాలు ఆవిష్కరించడమే కాకుండ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సాహిత్య పోటీలలో విద్యార్థులు బహుమతులు గెలిచే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నారని, ఈ పురస్కారం లభించడం చాలా ఆనందంగా ఉందని కృషికి తగ్గ ప్రతిఫలమని ప్రవీణ్ శర్మ సంతోషాన్ని తెలియజేశారు. పాఠశాల తెలుగు పండితుడు ప్రవీణ్ శర్మకి ఈ పురస్కారం రావడం పట్ల పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి, ఉపాధ్యాయ బృందం ప్రవీణ్ శర్మను అభినందించారు.