కరీంనగర్, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అమరవీరుడు కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కిష్టయ్య సతీమణి పద్మావతి, కుమారుడు రాహుల్, కోడలు వర్ష, కుమార్తె డాక్టర్ ప్రియాంకలతో కేటీఆర్ ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు బేబీ వేదాంత్ రాఘవ కిష్టయ్యను కేటీఆర్ ఆశీర్వదించారు. చిన్నారికి వస్త్రాలు, కానుకలు అందజేయడంతో పాటు, కిష్టయ్య పేరులోని ‘కె’ అక్షరంతో రూపొందించిన ప్రత్యేక లాకెట్ను బహూకరించారు. అలాగే, కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యాభ్యాసం కోసం బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా ఫీజు చెక్కును కేటీఆర్ అందజేశారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆత్మీయంగా గడిపిన కేటీఆర్, అమరవీరుడు కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ ఇంటికి వచ్చి పరామర్శించి, మనవడిని ఆశీర్వదించి, కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు కుమార్తె విద్యకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు కిష్టయ్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డా సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

