జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీరందరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా రంజక పాలన, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తీరు పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా వెలగబెట్టిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గంలోని గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని అన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెం.1 గా నిలుపుతానని చెప్పారు. కష్టపడే కార్యకర్తలకు, పార్టీ కోసం పనిచేసే వారికి, ప్రతిభ గల ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాజు పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, గ్రామ మాజీ సర్పంచ్ బాలామణి, షణ్ముఖ పటేల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

