- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. వేసెక్టమి జిల్లాస్థాయి పక్షోత్సవాల అవగాహన సదస్సును డి ఎం హెచ్ ఓ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసెక్టమి పక్షోత్సవాలు నవంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఉంటుందని, కుటుంబ నియంత్రణ లో పురుషులకు చేసే ఎన్ ఎస్ వి( నో స్కాల్ పాల్ వేసేక్టమీ ) కోత కుట్టులేని సురక్షితమైన శస్త్ర చికిత్స ఉత్తమమైనది, కావున కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెంచాలని, పీహెచ్ స్సీ స్థాయిలో జరిగే అవగాహన సదస్సులో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు వేసేక్టమీ పక్షోత్సవాలపై వివరించాలని అన్నారు. గృహ సందర్శన ద్వారా అర్హులైన దంపతుల జాబితాను తయారుచేసి వేసేక్టమీ శిబిరాలు నిర్వహించే కేంద్రాలకు తరలించి శస్త్ర చికిత్స చేయించాలన్నారు. అర్హులైన వారికి వారి ఇష్ట ప్రకారం కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన ఓరల్ పిల్స్ అంతర ఇంజక్షన్, పీపీ ఐయూసీడీ, కాపర్ టీ, నిరోద్ లాంటి వాటిని వాడేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ వెంకటేష్, ఏ ఎం ఓ సలీం, డిహెచ్ఇ వెంకటేశ్వర్లు మరియు వివిధ పీహెచ్సీల పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.
