29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో ఇరికించారు

Must read

📰 Generate e-Paper Clip

సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వారి వివరాలు తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతా

మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఇందుప్రియ

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలతో, ఈకేసుతో తన భర్తకు సంబంధం లేదని.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఇందుప్రియ అన్నారు. రాజకీయ కక్షతోనే  సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు.  పదవి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ,  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. అలాంటి తమపై సోషల్ మీడియా  వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని పేర్కొన్నారు. మూడు రోజుల నుంచి ప్రోబెల్స్​ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్​కు ముడి పెడుతున్నారని ఆరోపించారు. దానికి తమతో ఎలాంటి సంబంధం లేదన్నారు.  పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటి నుంచి వెళ్లాడని, 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఫోన్ వస్తే వెళ్లానని పేర్కొన్నారు. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అరెస్ట్ చేశారని ఇందుప్రియ వాపోయారు. బిచ్కుంద కోర్టు వద్ద రిమాండ్ చేశారని, అక్కడి నుంచి నిజామాబాద్ సారంగపూర్​ సెంట్రల్ జైలుకు తరలించారని తెలిపారు. శ్రీవారి వెంచర్​ను 2023లోనే విభూస్ ఎకో టౌన్ షిప్ వారికి డెవలప్​మెంట్​కు లీజ్ అగ్రిమెంట్ చేసి ఇచ్చామన్నారు. తన భర్తను అరెస్ట్ చేయడానికి ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. చట్టంపై తమకు నమ్మకం ఉందన్నారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

More articles

Latest article