సికింద్రాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంమత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. రజాకార్ల హింసాకాండపై ప్రజలు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. అప్పటి ప్రజల ఇబ్బందులు, పోరాటాలు తెలిపేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర బీజేపీ నేతలు
కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈనెల 17న ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పరిశీలించారు.