మేడ్చల్,బతుకమ్మ: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదునెలల గర్భవతైన భార్యను భర్త చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి (25), మహేందర్ ప్రేమ వివాహం చేసుకొని బోడుప్పల్ లోని బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే భార్యను హతమార్చి.. అనంతరం శరీర భాగాలను కవర్ లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమైన క్రమంలో గదినుంచి శబ్దాలు వినిపించాయి. పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూడటంతో కవర్ లోని శరీర భాగాలను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు మహేందర్ రెడ్డి చెప్పడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
