27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్హులైన ప్రతిఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీచేయాలి

 

. . . జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి

 

. . . టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ప్రతినిధులు డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జర్నలిస్టులు కృషిచేస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారని, తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారని, ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారని అన్నారు. పరిస్థితులు మారుతున్నాయని, ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయని, కానీ, జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని వాపోయారు. ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్ల కింద మార్చేసి హక్కులను కాలరాసిందని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని, అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదని, అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారని, అర్హులైన వారందరికి ఇవ్వాలనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. అదే విధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీచేయాలని, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ కార్డు ఇవ్వాలని, ఒకే యూనియన్ నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్ కమిటీల నుంచి తొలగించాలని, అందరికి సమాన ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. జర్నరలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ హెల్త్ కార్డు లు ఇవ్వాలని, కంట్రిబూషన్ ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలని, సీఎం ఇచ్చిన హామీ మేరకు ఇండ్లస్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన ప్రక్రియకు శ్రీకారం చుట్టి జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, లక్ష్మణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

 

House sites should be allocated to journalists.

More articles

Latest article