బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణం బురుడు గల్లీలోని పురాతన పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మహాలక్ష్మి ట్రస్ట్, పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణం చేపట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యులు, పట్టణ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

