నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్పేర్ కమిషన్ సభ్యులను నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే చైర్మన్ గా కోదండరెడ్డి నియమితులు కాగా తాజాగా సోమవారం ఏడుగురు కమిషన్ సభ్యులను నియమించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కు అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షుడిగా పని చేశారు. గతంలో డీఎస్ ప్రధాన అనుచరుడిగా ఉన్న గడుగు గంగాధర్ నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. డీఎస్ హయంలో తొలి నూడా చైర్మన్ అవుతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి రిజర్వు నియోజకవర్గం అయిన జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా అవకాశం దక్కలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గడుగు గంగాధర్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ నుంచి విరమించుకున్నారు. అయితే గడుగు గంగాధర్ కు కార్పొరేషన్ చైర్మన్ లేదా కమిషన్ చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. చివరకు కమిషన్ సభ్యుడిగా నియమించినట్లు ఉత్తర్వులు రాగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది డైలామా నెలకొంది.
