నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్ళను జిల్లా ఆహార భద్రతా అధికారులు టి.సునీత, నవితలు సోమవారం తనిఖీలు చేపట్టారు. నగరంలోని వినాయక్ నగర్ , బోధన్ రోడ్డులోని నాలుగు హోటళ్లలో తనిఖీలు చేపట్టి సరైన పరిశుభ్రత పాటించక పోవడం, నిషేధించబడిన ఉప్పు, నిషేధిత సింథటిక్ ఆహార రంగులను ఉపయోగించడం గుర్తించామని తెలిపారు. కొన్ని హానికరమైన రంగులు కలిగిన ఆహార పదార్థాలు వెంటనే పారవేయడం జరిగిందన్నారు. పచ్చి మాంసం నిల్వ ఉన్న ఫ్రీజర్స్ ఉష్ణోగ్రత సరిగా నిర్వహించడం లేదని వారికి నోటీసులు జారీ చేసి అనుమానం వచ్చిన శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. నమూనాలు రాష్ట్ర ఆహార ప్రయోగశాల కి పంపించి నివేదికలు వచ్చాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రెస్టారెంట్ సరైన పరిశుభ్రతను పాటించాలని,నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

