- అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, బతుకమ్మ : వానాకాలం పంట సీజన్ మొదలైందని, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలోని నవాదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్దంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవితతో అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారు.. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో రూ.10 లక్షలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది. పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ని విచారణ చేసింది. ఈ రోజు కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’’ అని తెలిపారు.
