నిజాంసాగర్, బతుకమ్మ : ప్రమాదవశాత్తు కుంటో పడి రైతు మృతి చెందిన ఘటన బుధవారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలంలోని వడ్డెపల్లికి చెందిన బాలయ్య(58) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం తన భార్య, కొడుకుతో కలిసి పాపేశ్వరుని కుంట వద్ద గల తన పొలానికి వెళ్లాడు. భార్య, కొడుకును పొలానికి నీరు పారుతుందో లేదో చూడమని చెప్పి తాను పాపేశ్వరుని కుంట వద్దకు వెళ్లాడు. చాలా సేపటి వరకు రాకపోయేసరికి బాలయ్య కుమారుడు రమేష్ పాపేశ్వరుని కుంట వద్దకు వచ్చి చూసాడు. అక్కడ తూము వద్ద బాలయ్య పడిపోయి ఉన్నాడు. వెంటనే రమేష్ చుట్టు పక్కల వారి సహాయంతో తన తండ్రిని బయటకు తీశాడు. కానీ బాలయ్య అప్పటికే మృతి చెందాడు. ప్రమాద వశాత్తు తన తండ్రి పాపేశ్వరుని కుంటలో పడి మృతి చెందాడని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
