- బైరాపూర్ లో ఉద్రిక్తత
మోపాల్, బతుకమ్మ : అటవీశాఖాధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు గడ్డిమందు తాగిన ఘటన మోపాల్ మండలలోని బైరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బైరాపూర్ గ్రామంలో కొన్నిరోజులుగా పోడు భూములను సాగు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం అటవీశాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. భూముల్లో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్ అధికారులు గడ్డిమందును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అధికారులను గ్రామంలోకి రానీయకుండా రైతులు నిరసన తెలిపారు. ఫారెస్ట్ అధికారులు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకోగా.. ఇదే సమయంలో ఓ రైతు అధికారులు తీసుకొచ్చిన గడ్డిమందు తాగాడు. దీంతో అతడిని ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తరలించారు. కొన్నేళ్లుగా తాము పోడుభూములను సాగు చేసుకుంటున్నామని.. ఫారెస్ట్ అధికారులు తమను వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
