. . . పోచారంలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ :
ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా తన పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గురువారం తన స్వగ్రామం పోచారంలో నిర్వహించిన ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన తన వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) కి అందజేసి ఓటరు నమోదును పూర్తి చేశారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి, ఓటరు నమోదు, సవరణల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

