ఎల్లారెడ్డి, బతుకమ్మ: మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దని పట్టణంలోని నలంద కళాశాల ప్రిన్సిపాల్ సంగ్రామ్ అన్నారు. కళాశాలలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగ్రామ్ మాట్లాడుతూ.. ఆంగ్ల భాషను నేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ మన మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నా.. అందులో మాతృభాషా చాలా గొప్పదన్నారు. మాతృభాష తల్లితో సమానమని, పసికందుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో.. విద్యార్థులకు మాతృభాష అంతే అవసరమని వివరించారు. మాతృభాషను మరువనంత వరకు విద్యార్థులు విజయాల బాటలో విహరిస్తారని అన్నారు. అనంతరం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల విద్య సంస్థల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
