రుద్రూర్, బతుకమ్మ : బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం నేరమని చట్టరీత్యా శిక్షార్హమని లేబర్ అధికారి నరేందర్ రాజ్ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో లేబర్ అధికారి నరేందర్ రాజ్, పోలీసు బృందం ఎస్సై పీటర్, చైల్డ్ హెల్ప్ లైన్, ఎన్జీవో సమన్వయ కర్తల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మెకానిక్ షాపులు, దుకాణ సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. బాల కార్మికుల సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం అనేక చట్టాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పిల్లలను వారి బాల్యం నుండి దూరం చేస్తూ, వారి విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ బృందం, పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.