బతుకమ్మ, బోధన్: రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన హున్సా (సాలూర మండలం)లో శనగ పంటల్లో కీటక నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శనగ పచ్చ పురుగు ఉనికిని గుర్తించేందుకు లింగాకార్షక బుట్టల వినియోగంపై అధికారులు రైతులకు సూచనలు అందించారు. పరిశోధన స్థానం అధిపతి డా. కే. పవన్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులు కేవలం రసాయనాలపై ఆధారపడకుండా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. శనగ పంటలో ఒక ఎకరాకు 5–6 లింగాకార్షక బుట్టలను పొలం నేలనుండి ఒక అడుగు ఎత్తులో అమర్చాలని సూచించారు. ఒక రోజు 5–6 కంటే ఎక్కువ శనగ పచ్చ పురుగులు వరుసగా మూడు రోజులు గమనించినప్పుడు మాత్రమే రసాయనాలు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో మొత్తం 10 మంది రైతులకు లింగాకార్షక బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ ఇన్చార్జి రమ్య రాథోడ్, శాస్త్రవేత్తలు డా. పరమేశ్వరి, ఎం. సాయి చరణ్, సొసైటీ చైర్మన్ ఎం. శంకర్తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.
